చలసాని ఆంజనేయులు రాజీనామా అప్రజాస్వామికం
విజయ డైరీని నిర్వీర్యం చేసేందుకే బలవంతపు రాజీనామా చేయించారు
అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్
విజయవాడ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో బలవంతంగా రాజీనామా చేయించడం అప్రజాస్వామిక చర్య అని అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో భాగంగానే విజయ డైరీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చైర్మన్ను తొలగించారని హరినాథ్ ఆరోపించారు. ఓటర్ల తీర్పును గౌరవించకుండా ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ ద్వారా ఒత్తిడి తెచ్చి ఆంజనేయులతో రాజీనామా చేయించారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ ప్రయోజనాలకు విజయ డైరీ అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే చైర్మన్ ఆంజనేయులను తప్పించారని ఆరోపించారు.
ప్రకృతి విపత్తులు, బుడమేరు వరదల సమయంలో విజయ డైరీని సమర్థంగా నడిపించిన చైర్మన్ ఆంజనేయులు, సొంత పార్టీలోనే రాజకీయ వెన్నుపోటుకు గురయ్యారని హరినాథ్ వ్యాఖ్యానించారు. సహకార సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ అధికార పార్టీ రాజకీయ జోక్యంతో వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.
సహకార వ్యవస్థను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతోందని హరినాథ్ విమర్శించారు. ప్రజాస్వామ్య సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకతను విస్మరిస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని అన్నారు. గతంలో నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు నిర్వహించిన ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని గుర్తుచేశారు.
విజయ డైరీ చైర్మన్ తొలగింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి జరిగిన తప్పును సరిదిద్దాలని హరినాథ్ డిమాండ్ చేశారు. విజయ డైరీ వినియోగదారులు, ఓటర్లు, రైతుల అభిప్రాయాలను గౌరవించి, ఎన్నికైన చైర్మన్ చలసాని ఆంజనేయులు ఇచ్చిన రాజీనామాను అంగీకరించకుండా ఆయననే పదవిలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
లేకపోతే ప్రజాస్వామ్యవాదులు, విజయ డైరీ వినియోగదారులు, రైతుల నుంచి తీవ్ర నిరసనలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హరినాథ్ హెచ్చరించారు. సహకార వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు రైతు సంఘాలు ఉద్యమాలను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.