చోరీలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
నల్గొండ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నల్గొండ వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన నిందితులు చెడు వ్యసనాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ముఠాగా ఏర్పడి గత రెండు నెలలుగా పట్టణంలోని వివిధ కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నల్గొండ పట్టణ పరిధిలో మొత్తం ఐదు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ వారిలో పంజేషకు చెందిన నదీమ్ (25), ఘడి మస్జిద్ ప్రాంతానికి చెందిన షేక్ రిజ్వాన్ (26), హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ సమీర్ (23) ఉన్నారు. నిందితుల నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, నాలుగు గ్యాస్ సిలిండర్లు, మూడు బ్యాటరీలు, నాలుగు సెల్ఫోన్లు, రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాల మేరకు వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, వెంకట్ నారాయణ మరియు సిబ్బంది రబ్బానీ, సాగర్ల శంకర్, అంజద్, కిరణ్, అంజయ్య చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అభినందించారు.