P4 విధానంలో రూ.24 లక్షల విలువైన వాహనాలు అందజేత
దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రెండు బొలెరో నియో వాహనాలు
రాజమహేంద్రవరం | Ntoday News
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 విధానంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం విలువ రూ.12 లక్షలు కాగా, రెండు వాహనాల మొత్తం విలువ రూ.24 లక్షలుగా ఉంది.
రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ సమక్షంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు వాహనాలను పోలీస్ శాఖకు అందజేశారు.
గోపాలపురం పోలీస్ స్టేషన్కు అందజేసిన బొలెరో నియో వాహనాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు, గోపాలపురం మండల నాయకులు, ఎమ్మెల్యే సౌజన్యంతో సమకూర్చారు. అదే విధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్కు అందజేసిన మరో వాహనాన్ని పరమేశు బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ సంస్థ సౌజన్యంతో అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు అవసరమైన వాహనాలు సమకూరడం ద్వారా అధికారులు, సిబ్బంది మరింత వేగంగా విధులు నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో సత్వర స్పందనతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి పనిచేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, ఎస్బీ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, దేవరపల్లి సర్కిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.