స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సత్తుపల్లిలో భారీ నిరసన
తాతా మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం.. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్
సత్తుపల్లి | Ntoday News
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్రోడ్ మీదుగా బస్సు స్టాండ్ రింగ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా తాతా మధు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ను బహిరంగంగా అవమానించేలా, అసభ్యకరంగా మాట్లాడటం తగదని అన్నారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తాతా మధును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాబలమే మా బలం: మట్టా దయానంద్
డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ.. ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి మరో దళిత నాయకుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
అలాగే సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్యపై కూడా మట్టా దయానంద్ విమర్శలు చేశారు. గతంలో టీడీపీలో ఉండి బీఆర్ఎస్, కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి అనంతరం బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా విరుద్ధ వైఖరికి నిదర్శనమని అన్నారు. టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచి పలు పదవులు అనుభవించిన అనంతరం ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
గతంలో తాము టీఆర్ఎస్లో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడ్డామని, పార్టీకి, నాయకులకు ఎప్పుడూ మోసం చేయలేదని మట్టా దయానంద్ పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ తమను మోసం చేశారని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో గెలిచామని, ప్రజాబలమే తమ బలమని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు