గుంటూరు: వృద్ధ గిరిజన మహిళను దూషించిన సీఐపై చర్యలు తీసుకోవాలి
గుంటూరు: 70 ఏళ్ల గిరిజన మహిళను అసభ్య పదజాలంతో దూషించిన చీరాల టు టౌన్ సీఐ శశికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపకులు వధిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
వృద్ధ మహిళ పట్ల సీఐ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం గుంటూరులో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లాలోని ఆదినారాయణపురంలో ఈ నెల 6న నిర్వహించిన కార్డన్ సెర్చ్లో భాగంగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మట్రా జాలమ్మను సీఐ దూషించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధ మహిళతో సీఐ మాట్లాడిన మాటలు తమ ఆత్మను ఘోషించేలా చేశాయని, మనసును కలిచివేశాయని శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, హోం శాఖ వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉందని అన్నారు. మట్రా జాలమ్మ ఘటనపై తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
గిరిజనుల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని శంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.