దోర్నాల: ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
మార్కాపురం జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎస్ఎస్జీ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం, అక్కడి నుంచి జలహారతి ప్రదేశం వరకు, పైలాన్, గేట్లు, బహిరంగ సభా వేదిక, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్, జలహారతి ప్రదేశం, బహిరంగ సభా వేదిక వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బాలికల నృత్య ప్రదర్శన జరిగే ప్రదేశం, సభా ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. హెలిప్యాడ్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫీడర్ కాలువ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.