కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
పులివెందుల : ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందేలా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ అధికారులను ఆదేశించారు.
శనివారం నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎర్రబల్లి కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లినిక్లో అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలను పరిశీలించారు.
టీకాలు వేయించుకుంటున్న గర్భిణులతో డీఎంహెచ్ఓ స్వయంగా మాట్లాడి, వారికి అందిస్తున్న టీకాల వివరాలు, వాటి ప్రాధాన్యత, ఏ టీకా ఎందుకు వేస్తున్నారనే అంశాలపై అవగాహనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో మాతా–శిశు సంరక్షణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ గారు మీడియా తో మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల్లో నాణ్యతతో పాటు సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు.
గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ప్రసవ పూర్వ–అనంతర సంరక్షణ, చిన్నారులకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నూరు శాతం సాధించేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎర్రబల్లి కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ను జిల్లాలోనే ఉత్తమ క్లినిక్గా తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్యం లు , ఎంపీహెచ్ఏలు, ఆశా కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ సూచించారు.
వైద్య సేవల్లో వైఎస్సార్ జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాజా మౌనిద్దీన్, డీపీఎంవో డాక్టర్ మహమ్మద్ తహా, డీపీవో నారాయణ, డాక్టర్ బాలాజీ, సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య, ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.