పోలవరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
పోలవరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం పోలవరం
పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి.ఎస్.వి. బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ తెలుగు వారి ఆహారం, ఆహార్యం, సంస్కృతి, సాహిత్యం ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.
అనంతరం విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెంపొందించేందుకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన శతక సాహిత్య పుస్తకాలను అందజేశారు. వేమన శతకం, సుమతి శతకం, కుమార శతకం, దాశరథి శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం, ఆంధ్రనాయక శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం పుస్తకాలను పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు బి. మమత విద్యార్థులకు బహూకరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీలో విశేష ప్రతిభ కనబరిచి దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు బి. మమత, వ్యాయామ ఉపాధ్యాయుడు డి. శ్రీహరి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.