మార్కాపురం: సీపీఎం, ప్రజాసంఘాల నేతలపై పోలీసుల నిర్బంధం
మార్కాపురం: వెలిగొండ ప్రారంభోత్సవం వేళ సీపీఎం, ప్రజాసంఘాల నేతలపై పోలీసుల నిర్బంధం
బైండోవర్ కేసులు నమోదు.. పోలీస్ స్టేషన్కు పిలిపించి సంతకాలు
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో నిర్వాసితులకు అండగా నిలుస్తున్న సీపీఎం నేతలను పోలీసులు బైండోవర్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ, ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్, మండల నాయకులు వందన్కుమార్, నిర్వాసిత పోరాట కమిటీ నాయకులు కె.దేవసహాయం, కుందూరు అంజిరెడ్డి, దర్శనం యేసురాజు, శశింద్ర, రంగసాయిలు, ఎం.అనిల్పై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి సంతకాలు చేయించుకున్న అనంతరం విడుదల చేశారు. బైండోవర్ సమయంలో సీఐ ఎండీకే అల్తాఫ్ హుస్సేన్తో సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నామని, అయితే నిర్వాసితులకు రావాల్సిన పరిహారం, ప్యాకేజీ అందే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లోని వైసీపీ గ్రామస్థాయి నాయకులను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు పోలీసులు ఫోన్లు చేసినట్లు తెలిసింది.
నిర్బంధం ప్రజాస్వామ్య విరుద్ధం: రమాదేవి
నిర్వాసితులకు అండగా నిలిచిన సీపీఎం, ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి పేర్కొన్నారు. పోలీసుల చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్బంధ మార్గాన్ని ఎంచుకోవడం తగదన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర ఖండన
వెలిగొండ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాసితుల తరఫున పోరాడుతున్న సీపీఎం నాయకులను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్న నాయకులపై నిర్బంధం అప్రజాస్వామికమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం మూడు దశాబ్దాలుగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారని తెలిపారు.
1996లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకుల ఒత్తిడితోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు శంకుస్థాపనకు అంగీకరించారని గుర్తు చేశారు. అనంతరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన ప్రతిసారి వామపక్షాలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మాజీ ఇంజనీర్లు ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు.
నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ అందించాలన్న డిమాండ్తో సాగిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఇప్పటికీ 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు 2019 ప్యాకేజీ అమలు చేయకుండా రూ.2 లక్షలతో సరిపెట్టడం అన్యాయమని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, వెంటనే నిర్బంధ చర్యలు నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.