ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఖరారు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఖరారు విజయవాడ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఖరారు
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14లోగా డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు గడువు విధించింది. అనంతరం ఈ నెల 15న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించనున్నారు. జాబితాపై రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిశీలించేందుకు ఈ నెల 16న రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనుంది. అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ఈ నెల 18న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. తుది జాబితాను ఈ నెల 19న అధికారికంగా ప్రచురించనున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు, ఓటర్లకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు జాబితాను రూపొందించనున్నారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.