ఏపీలో పేదలకు 2-3 సెంట్ల ఉచిత ఇంటి స్థలాలు...
ఏపీలో పేదలకు 2-3 సెంట్ల ఉచిత ఇంటి స్థలాలు.. భూసేకరణకు ప్రభుత్వం సిద్ధం
అమరావతి: రాష్ట్రంలో ఇల్లులేని పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, నవంబర్ నుంచి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.
ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాల్లో అవసరమైన భూములను గుర్తించి, దశలవారీగా స్థలాల పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ నిర్ణయంతో సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుందని భావిస్తున్నారు.