ఘట్కేసర్-కాజీపేట మధ్య మల్టీ ట్రాకింగ్
- రూ.9,450 కోట్లతో ఐదు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- నాలుగు రాష్ట్రాల్లో 540 కి.మీ. మేర అదనపు రైల్వే మార్గాల ఏర్పాటు
- 2029-30 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
- 2,121 గ్రామాలకు అనుసంధానం.. 52 లక్షల మందికి ప్రయోజనం
- ఘట్కేసర్ - కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెంపు
- యాదాద్రి భువనగిరి, స్వర్ణగిరి క్షేత్రాలకు మెరుగవనున్న రైలు కనెక్టివిటీ
Ntoday News / తెలంగాణ బ్యూరో
సికింద్రాబాద్: తెలంగాణలో అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే సికింద్రాబాద్ (ఘట్కేసర్) -కాజీపేట రైలు మార్గంలో ట్రాక్ విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), సికింద్రాబాద్ (ఘట్కే సర్)-కాజీపేట మధ్య 110 కి.మీ. మేర మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అరక్కోణం - రేణిగుంట మధ్య 77 కి.మీ. మేర 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. పీఎం-గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను ఉత్తర, తూర్పు భారతంతో అనుసంధానించే సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు మల్టీ ట్రాకింగ్ చేపట్టడం వల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడంతో పాటు లైన్ కెపాసిటీ గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భువనగిరి కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి క్షేత్రాలకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఈ ప్రాజెక్టుతో రవాణా సదుపాయం మరింత మెరుగుపడనుంది. మరోవైపు అరక్కోణం-రేణిగుంట మధ్య అదనపు లైన్ల నిర్మాణంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని వైట్ఫీల్డ్-బంగారుపేట (47 కి.మీ 3. 4వ లైన్లు), తమిళనాడులోని హోసూర్ - ఓమలూర్ (147 కి.మీ డబ్లింగ్), సేలం-కరూర్-దిండి గల్(159 కి.మీ డబ్లింగ్) ప్రాజెక్టులు కలిపి మొత్తం రూ.100 కోట్ల వ్యయంతో 540 కి.మీ విస్తరణ పనులను కేంద్రం మంజూరు చేసింది.