హైదరాబాద్లో భూముల ధరల రికార్డు.. ఎకరం రూ.264 కోట్లు
హైదరాబాద్లో భూముల ధరల రికార్డు.. ఎకరం రూ.264 కోట్లు
రాయదుర్గం పాన్ మక్తాలో టీజీఐఐసీ వేలం.. ఆకాశాన్ని తాకిన ధరలు
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో సంచలనం నమోదైంది. హైదరాబాద్లోని అత్యంత కీలకమైన రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది.
రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వేలం వేసింది. ఈ వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లకు చేరడంతో భూముల విలువ మరోసారి చర్చనీయాంశంగా మారింది
ఐటీ కారిడార్కు సమీపంలో ఉండటం, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ, ప్రముఖ సంస్థలకు అనుకూలమైన ప్రాంతంగా ఉండటంతో రాయదుర్గం భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. పెట్టుబడిదారుల నుంచి వచ్చిన పోటీ కారణంగానే ఈ స్థాయిలో ధర పలికినట్లు తెలుస్తోంది.
గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన వేలంలో ఎకరం భూమి రూ.237 కోట్ల ధర పలికింది. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.264 కోట్ల ధర నమోదైంది. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రాయదుర్గం మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది.
ప్రభుత్వ భూముల వేలాల్లో వరుసగా నమోదవుతున్న భారీ ధరలు హైదరాబాద్ నగరానికి ఉన్న వాణిజ్య ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. ఐటీ, వాణిజ్య అభివృద్ధి విస్తరిస్తుండటంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో భూముల విలువలు మరింత పెరుగుతున్నాయి.