పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి....
పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి.. ‘ఎల్ నినో’తో ప్రపంచానికి పెను ముప్పు
1877 రికార్డులు బద్దలయ్యే అవకాశం.. భారత్పై కరువు మేఘాలు
రుతుపవనాలపై తీవ్ర ప్రభావం.. రైతన్నకు అశనిపాతం
పసిఫిక్ మహాసముద్రం మంటలు కక్కుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేని స్థాయిలో పెరుగుతూ ప్రపంచ వాతావరణ సమతుల్యతను తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం మరింత బలపడితే రాబోయే రోజుల్లో వర్షపాతంలో భారీ మార్పులు చోటుచేసుకుని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే భారీగా పెరుగుతున్నాయి. గతంలో 1877లో నమోదైన అత్యధిక ఎల్ నినో తీవ్రత రికార్డులను మించే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల గాలి ప్రవాహాల్లో మార్పులు చోటుచేసుకుని ప్రపంచవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారత్పై కరువు ప్రభావం?
భారత వ్యవసాయ రంగం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో సాధారణంగా రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
గత ఎల్ నినో సంవత్సరాలను పరిశీలిస్తే వర్షపాతంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 2002లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకాగా, 2009లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. 2015-16 కాలంలోనూ ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గింది.
ఎంజేఓపైనే ఆశలు
ప్రస్తుత పరిస్థితుల్లో భారత వాతావరణానికి మాడెన్ జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) కీలకంగా మారింది. భూమధ్యరేఖ వెంబడి కదిలే మేఘాలు, గాలులు, వర్షపాత వ్యవస్థల సమూహమే ఎంజేఓ. ఇది అనుకూలంగా కదిలితే రుతుపవనాలను బలోపేతం చేసి వర్షాలకు సహకరించే అవకాశం ఉంటుంది.
ఎంజేఓ అనుకూల ప్రభావం చూపితే ఎల్ నినో తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎంజేఓ సహకారం లేకపోతే ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చి వ్యవసాయ రంగానికి, నీటి వనరులకు పెద్ద సవాల్గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పరిశీలిస్తోంది.
మరుగుతున్న మహాసముద్రం.. మారుతున్న వాతావరణం.. రాబోయే కాలం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెద్ద ఆందోళనగా మారింది.