చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం
అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: సైదాబాద్ ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి
సైదాబాద్| ఎన్ టుడే న్యూస్
తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సైదాబాద్ ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి తెలిపారు.
ప్రథమ దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు (తాటి/ఈత కల్లు కార్మికులు), చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే థలసీమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో దివ్యాంగులైన వారు కూడా అర్హత నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల ప్రకారం అర్హత నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అర్హులైన వారు ముందుగా మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని, అనంతరం సంబంధిత దరఖాస్తు పత్రాలను మండల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
ఆగస్టు 31 చివరి తేదీ
దరఖాస్తుల స్వీకరణకు 2026 ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించినట్లు ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి తెలిపారు. అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.