పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం.....
పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం
మేడికొండూరు: వర్షాభావ పరిస్థితులతో పంట కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు సొంత ఖర్చులతో నీటిని పొలాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన సాంబయ్య 3.5 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటకు నీరు అందించేందుకు గ్రామంలోని ఊరచెరువు నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి, మోటారు సహాయంతో నీటిని పొలాలకు తరలిస్తున్నారు. ఒక్కో పైపునకు రూ.1,500 చొప్పున మొత్తం 253 పైపులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇదే గ్రామానికి చెందిన మరో రైతు గజానంద్ రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటకు నీటి తడులు అందించేందుకు సొంతంగా ఖర్చు చేస్తూ నీటిని పొలాలకు తరలిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇలా వేలాది రూపాయలు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట కాలువలకు సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.