మంగళగిరిలో రూ.18 కోట్లతో మోడల్ రైతు బజార్కు శ్రీకారం
మంగళగిరిలో రూ.18 కోట్లతో మోడల్ రైతు బజార్కు శ్రీకారం
5.90 ఎకరాల్లో ఆధునిక రిటైల్, హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం
రేపు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్
మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో ఆధునిక సౌకర్యాలతో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
మోడల్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రిటైల్, హోల్సేల్ కూరగాయల మార్కెట్గా తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్టును రూ.18 కోట్ల వ్యయంతో అరబిందో ఫార్మా ట్రస్ట్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టనున్నారు.
71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
మొత్తం 5.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ మోడల్ రైతు బజార్లో వినియోగదారులకు, వ్యాపారులకు అనువైన ఆధునిక వసతులు కల్పించనున్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ను అభివృద్ధి చేయనున్నారు.
రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాలకు 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర వస్తువుల విక్రయాల కోసం 60 దుకాణాలు నిర్మించనున్నారు.
హోల్సేల్ మార్కెట్లో 18 సరుకు దిగుమతి వేదికలు, 23 కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులు, వ్యాపారులకు అనుకూలంగా సరుకు నిల్వ, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు.
అత్యాధునిక సదుపాయాలతో రూపకల్పన
మార్కెట్లో శీతల నిల్వ కేంద్రం, కూరగాయల శుభ్రపరిచే ప్రాంతాలు, పరిపాలన విభాగం, నిర్వహణ కేంద్రాలు, క్యాంటీన్, ప్రజల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు.
వాహనాల రాకపోకలకు అనుగుణంగా సరుకు రవాణా వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
నీటి సంప్, పై నీటి ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, చెత్త సేకరణ కేంద్రం, సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, పైకప్పుపై సౌర విద్యుత్ ఫలకాలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
మంగళగిరిలో రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా ఈ మోడల్ రైతు బజార్ను అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు కొత్త వేదిక అందుబాటులోకి రానుంది.