గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ గురి..!
గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ గురి..! కావటి మనోహర్ నాయుడుపై కాషాయ పార్టీ దృష్టి
గుంటూరు నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మేయర్ స్థానాన్ని దక్కించుకునే లక్ష్యంతో నగరంలోని కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే ఆయన కాషాయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
కావటి మనోహర్ నాయుడును మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఉన్న గుర్తింపు, ఆర్థికంగా బలమైన నాయకుడిగా ఉన్న పేరు కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేస్తున్నట్లు సమాచారం.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు నగర మేయర్గా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు, ఆ పార్టీ ఓటమి తర్వాత రాజకీయంగా కొంత దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గత కార్పొరేషన్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన కావటి, మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరిగే అవకాశం ఉండటంతో తన రాజకీయ ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుంటూరు నగర రాజకీయాల్లో ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తిగా మారింది.