ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
*కొండమల్లేపల్లి కేజీబీవీలో ఘటన.. ఉపాధ్యాయుల పరుష పదజాలం, హేళనతో మనస్తాపం
కొండమల్లేపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఉపాధ్యాయుల వేధింపుల కారణంగా ఇద్దరు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. అధ్యాపకులు విద్యార్థినులను తోటి విద్యార్థుల ఎదుట పరుష పదజాలంతో దూషించి, హేళన చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బాధితురాలు విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్లీష్ మీడియం బోధన అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న తాను జువాలజీ పీరియడ్లో లెక్చరర్ అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం చెప్పలేకపోయానని తెలిపింది. దీంతో తనను గంటల తరబడి నిలబెట్టి శిక్షించారని ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థిని తరగతికి ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట నిలబెట్టారని పేర్కొంది.
ఇద్దరినీ తోటి విద్యార్థుల ఎదుట పరుష పదజాలంతో దూషిస్తూ, తమ బ్యాచ్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు బాధితులు తెలిపారు. మంగళవారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలోనే ఇద్దరు విద్యార్థినులు హెయిర్ కేర్ రసాయనం పురుగుల మందు సేవించినట్లు వైష్ణవి తెలిపింది. అనంతరం వారు వాంతులు చేసుకోవడంతో తోటి విద్యార్థులు గుర్తించి పాఠశాల సిబ్బందికి సమాచారం అందించినట్లు పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించకుండా పాఠశాల సిబ్బంది జాప్యం చేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన అనంతరం రాత్రి సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై కూడా బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. ‘‘మాకు పాఠశాలతో ఎలాంటి సంబంధం లేదు.. మేమే స్వయంగా ఈ చర్యకు పాల్పడ్డాం’’ అని లేఖ రాయించుకున్నారని విద్యార్థిని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. తమ పిల్లలను అందరి ఎదుట అవమానించడం వల్లే వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన జువాలజీ లెక్చరర్, సూపరింటెండెంట్తో పాటు ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యత నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.