ఏలూరు: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష....
ఏలూరు: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష.. 414 కోట్లతో 388 పనులకు ప్రతిపాదనలు
ఏలూరు: గోదావరి మహా పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర సచివాలయం నుంచి జరిగిన ఈ సమీక్షలో మంత్రులు, పుష్కరాల ప్రత్యేక అధికారి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాటు, మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
సమావేశంలో ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో గోదావరి మహా పుష్కరాల కోసం చేపట్టనున్న ఏర్పాట్ల వివరాలను సీఎంకు వివరించారు. ఏలూరు జిల్లాలో రూ.414 కోట్ల అంచనా వ్యయంతో 388 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, భక్తుల సౌకర్యార్థం 28 స్నాన ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.