నందిగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు..
నందిగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ:
మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ పట్టణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మ మార్గాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తోటి ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, కరుణతో సేవ చేయడం ద్వారానే ప్రవక్త ఆశయాలను ఆచరణలో పెట్టినట్లు అవుతుందని తెలిపారు.
ప్రవక్త దయ, కరుణ, బోధనలు ఈ పవిత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర పర్వదినం సమాజంలో శాంతి, సద్భావన, సోదరభావాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.