స్నాప్చాట్ పరిచయం.. ఆర్థిక మోసానికి దారి
స్నాప్చాట్ పరిచయం.. ఆర్థిక మోసానికి దారి చనిపోతానంటూ బెదిరించి యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు చేసిన యువకుడు
విజయవాడ/హైదరాబాద్: సోషల్ మీడియా పరిచయం ఓ యువతిని భారీ ఆర్థిక మోసానికి గురిచేసింది. స్నాప్చాట్ ద్వారా పరిచయమైన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి ఏకంగా రూ.1.38 కోట్లు వసూలు చేసిన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమెకు మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు స్నాప్చాట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను విప్రో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట తన స్వస్థలమని చెప్పి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.
కొంతకాలంగా ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరూ కలిసి కోయంబత్తూరు పర్యటనకు వెళ్లారు. అక్కడ గౌతంనాయుడు తాను ఆన్లైన్ క్రిప్టోకరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ప్రస్తుతం ఆ డబ్బు బ్లాక్ అయిందని చెప్పాడు. అత్యవసరంగా డబ్బులు కావాలని యువతిని కోరాడు.
అతడి మాటలు నమ్మిన యువతి లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని తొలుత రూ.10.42 లక్షలు ఇచ్చింది. మరింత డబ్బు కావాలని అడగడంతో తన వద్ద లేవని చెప్పింది. దీంతో గౌతంనాయుడు తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం ప్రారంభించాడు.
ఇందులో భాగంగా సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంటున్నట్లు ఫొటోను వాట్సప్లో పంపడంతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. విషయం తల్లికి తెలియకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టడంతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు అతడికి ఇచ్చింది.
అయినా గౌతంనాయుడు ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో బాధిత యువతి చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
– బూర్గుల రమేష్, రిపోర్టర్