తిరుమలలో గోబీ వంటకాలకు బ్రేక్.. నేటి నుంచి కొత్త నిబంధనలు!
తిరుమలలో గోబీ వంటకాలకు బ్రేక్.. నేటి నుంచి కొత్త నిబంధనలు!
భక్తుల ఫిర్యాదులతో టీటీడీ కీలక నిర్ణయం.. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు సూచనలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తిరుమల కొండపై ఉన్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో క్యాలీఫ్లవర్తో తయారు చేసే గోబీ వంటకాలకు క్రమంగా స్వస్తి పలకాలని ఆరోగ్య విభాగం సూచించినట్లు సమాచారం.
క్యాలీఫ్లవర్లో పురుగులు కనిపిస్తున్నాయంటూ భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు రావడంతో టీటీడీ అప్రమత్తమైంది. గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను నిలిపివేయాలని హోటల్ నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
తనిఖీల్లో బయటపడిన అంశాలు
తిరుమలలో ప్రస్తుతం సుమారు 162 ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, హోటళ్లు, 7 జనతా కాంటీన్లు, 5 పెద్ద కాంటీన్లు ఉన్నాయి. ఇటీవల ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని చోట్ల క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో టీటీడీ ఆరోగ్య విభాగం చర్యలకు సిద్ధమైంది.
వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై చర్చ జరిగింది. ఈ కాలంలో క్యాలీఫ్లవర్లో పురుగులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సరైన శుభ్రత పాటించకుండా వంటల్లో ఉపయోగిస్తే భక్తుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.
భక్తుల ఆరోగ్యానికే ప్రాధాన్యం
చైనీస్, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో గోబీ వంటకాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీటీడీ సూచనలను పాటించేందుకు హోటల్ నిర్వాహకులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇక తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే కూరగాయల సరఫరాలో క్యాలీఫ్లవర్ చేరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై నిఘా పెంచేందుకు విజిలెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగవచ్చని భావిస్తున్నారు.
అన్నదానంపై కొనసాగుతున్న స్పష్టత
మరోవైపు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, భారీ మొత్తంలో కూరగాయలు టీటీడీకి అందుతున్నాయి. దాతలు అందించే కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఉంటోంది.
హోటళ్లకు మాత్రమే ఇచ్చిన సూచనలను అన్నదాన విభాగంలోనూ అమలు చేయాలా అనే అంశంపై టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత అన్నదానంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భక్తుల ఆరోగ్య రక్షణ కోసం పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తే, దాతల నుంచి కూడా క్యాలీఫ్లవర్ను స్వీకరించకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో తిరుమల కొండపై ఇక గోబీ వంటకాలు కనిపించకపోవచ్చన్న చర్చ సాగుతోంది.