పెనుగొలను హైస్కూల్లో ముగిసిన రెండో దశ జ్ఞాన జ్యోతి శిక్షణ శిబిరం
అంగన్వాడీ కార్యకర్తలకు బాలల వికాసంపై అవగాహన
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రెండో దశ "జ్ఞాన జ్యోతి" శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది.
అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి దశ శిక్షణ ఆగస్టు 11 నుంచి 13 వరకు, రెండో దశ శిక్షణ ఆగస్టు 22 నుంచి 25 వరకు నిర్వహించారు. ఈ శిక్షణలో అంగన్వాడీ చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించే పద్ధతులు, బాలల మేధో వికాసానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు.
చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచే విధానాలు, ఆటల ద్వారా నేర్పించే పద్ధతులు, వయసుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించే విధానాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఉత్సాహంగా ఉండేలా వివిధ రకాల ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో సీడీపీవో పీ. కృష్ణకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల బాలల సమగ్ర వికాసానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కార్యకర్తలు ఆచరణలో పెట్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఏ. చైతన్యభవాని, శిక్షకులు కాంతారావు, మురళీకృష్ణ, కిరణ్మయి, వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.