ధర్మాజిగూడెం ప్రతిభ కాలేజీలో విద్యార్థులకు పోలీసుల అవగాహన.. అత్యవసర నంబర్లు, రోడ్డు భద్రతపై సూచనలు
ఏలూరు జిల్లా లింగపాలెం, ఆగస్టు 25 లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ధర్మాజీగూడెం పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన విధానం, టోల్ఫ్రీ నంబర్ల వినియోగం, రోడ్డు భద్రత నిబంధనలపై విద్యార్థులకు వివరించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న తన సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజలు ప్రభుత్వ అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసు, అగ్నిమాపక, వైద్య సహాయం కోసం 112, మహిళల రక్షణ మరియు సహాయం కోసం 181, బాలల సంరక్షణ కోసం 1098, సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు 1930 నంబర్లను వినియోగించాలని వివరించారు.
అలాగే రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలకే ప్రమాదమని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పోలీసులు తెలిపిన విషయాలను విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేసి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.