ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు..
ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు.. ఓబీసీల అభ్యున్నతికి ఆయన సేవలు చిరస్మరణీయం
విస్సన్నపేట, ఆగస్టు 25:
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ కమిషన్ చైర్మన్, సంఘసంస్కర్త బీ.పీ. మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీ.పీ. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీ.పీ. మండల్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించి, బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అవకాశాలు పెరగడానికి మండల్ చేసిన కృషి చారిత్రాత్మకమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు యామిని, సాయిమణికంఠ, హరీష్, హర్ష తదితరులు పాల్గొని బీ.పీ. మండల్ సేవలను స్మరించుకున్నారు.