రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం
రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం
ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు: మంత్రి నారా లోకేష్
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఏపీలో అడుగుపెట్టడం రాష్ట్రానికి కీలక పరిణామమని పేర్కొన్నారు. సుజ్లాన్ రాకతో ఏపీలో గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 175 గిగావాట్ల లక్ష్యానికి చేర్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి 22 క్లస్టర్లను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఏపీ–సుజ్లాన్ భాగస్వామ్యంతో సుమారు 12 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
“అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, ఇప్పుడు సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విషయంలో అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలిపారు.