స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం.. విజయమే ధ్యేయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
చాట్రాయి టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
చాట్రాయి, ఆగస్టు 25:
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రేనిపాడులో జరిగిన పాప్కార్న్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.
ఈ సందర్భంగా చాట్రాయి మండలంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామస్థాయిలో ప్రజా అనుసంధానం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేసినట్లు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తెలిపారు.
గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో ప్రజల మద్దతును కూడగట్టాలని, సమష్టి కృషితో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచనలు చాట్రాయి మండల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.