అమరావతి వేదికగా ఏపీ–యూకే కీలక ఒప్పందం పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై కలిసి పనిచేసేందుకు ఎంఓయూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మరియు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ట్రేడ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.
రాష్ట్ర సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక సహకారం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర పట్టణ ప్రాంతాల అభివృద్ధికి యూకే సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సహకారం అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భవిష్యత్లో స్మార్ట్ పట్టణాల అభివృద్ధి, స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన పట్టణ సేవల అందించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.