చాట్రాయి హైస్కూల్లో ముగిసిన రెండో దశ ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ శిబిరం
అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల సమగ్ర వికాసంపై ప్రత్యేక అవగాహన.. ఆటపాటలతో విద్యాబోధనపై శిక్షణ
చాట్రాయి, ఆగస్టు 25:
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగిన రెండో దశ ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ముగిసింది. అంగన్వాడీ కార్యకర్తలకు పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారుల మానసిక, శారీరక, సామాజిక వికాసానికి అవసరమైన ఆధునిక బోధనా విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించారు.
చిన్నారుల భవిష్యత్కు పునాది వేసే దశలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని, ఈ దశలో వారికి అందించే విద్య, ఆటలు, అలవాట్లు జీవితాంతం ప్రభావం చూపుతాయని శిక్షకులు వివరించారు. పిల్లల ఆసక్తులను గుర్తించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా బోధన ఉండాలని సూచించారు.
మొదటి దశ శిక్షణ ఆగస్టు 11 నుంచి 13 వరకు, రెండో దశ శిక్షణ ఆగస్టు 22 నుంచి 25 వరకు నిర్వహించారు. ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పే విధానం, కథలు, పాటలు, ఆటల ద్వారా అభ్యసన పెంచడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు తరగతి గదుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, భయం లేకుండా స్వేచ్ఛగా నేర్చుకునే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని శిక్షకులు తెలిపారు. పిల్లల వయసుకు అనుగుణంగా ఆటలతో కూడిన అభ్యసన విధానాలు అమలు చేస్తే వారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు ‘జ్ఞాన జ్యోతి’ వంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. శిక్షణలో పొందిన జ్ఞానాన్ని ప్రతి కార్యకర్త తమ కేంద్రాల్లో అమలు చేసి చిన్నారుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
మండల విద్యాశాఖాధికారి 2 వీఎస్వీ బ్రహ్మచారి మాట్లాడుతూ.. చిన్నారుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు కొత్త పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం బోధకులుగానే కాకుండా చిన్నారుల మార్గదర్శకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిలో ప్రారంభ దశ ఎంతో ముఖ్యమని, అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లల్లో విద్యపై ఆసక్తి పెంచితే భవిష్యత్లో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
అంగన్వాడీ సూపర్వైజర్ గాయత్రీ దేవి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడం, చిన్నారులకు మెరుగైన అభ్యసన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారుల సమగ్ర వికాసానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
శిక్షణలో భాగంగా చిన్నారులతో మమేకమై బోధించే విధానం, ఆటల ద్వారా విద్యను అందించే పద్ధతులు, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక ప్రవర్తన వంటి అంశాలపై కూడా కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
శిక్షణ ముగింపు సందర్భంగా పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు తమకు అందించిన శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని, కేంద్రాల్లో చిన్నారులకు మరింత మెరుగైన రీతిలో బోధించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిక్షకులు సత్తెనపల్లి రాము, ఏ. వెంకటేశ్వరరావు, శేఖర్తో పాటు వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.