గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
ఘట్కేసర్ పరిధిలో నిందితుడి అరెస్ట్.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు
హైదరాబాద్: గచ్చిబౌలి ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మసీద్బండ సమీపంలోని నిర్మాణ కార్మికుల నివాస శిబిరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే బాధిత కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలన, దర్యాప్తు ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించారు.
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కిడ్నాప్కు గురైన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రాథమిక విచారణలో అదే లేబర్ క్యాంప్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి చిన్నారులను క్షేమంగా తీసుకురావడంపై పోలీసుల పనితీరుపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.