ఇల్లూరు గ్రామంలో ఘనంగా వన మహోత్సవం..
ఇల్లూరు గ్రామంలో ఘనంగా వన మహోత్సవం.. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి
మధిర: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మధిర మండలం ఇల్లూరు గ్రామంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇల్లూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడి పెంచినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్క నాటేలా గ్రామ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పచ్చదనం పెరిగితే గ్రామంలో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, వీఓ సీత, చైర్మన్ నిర్మల జ్యోతి, ఈజీఎస్ జానీ తదితరులు పాల్గొన్నారు.