తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా
తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఇళ్ల స్థలాలు, పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన.. డిమాండ్లతో మెమోరాండం సమర్పణ
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు:
పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం తిరువూరులో ధర్నా నిర్వహించారు. తిరువూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం తహసీల్దార్ చంద్రమౌళికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. గతంలో మంజూరైన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలు, సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎస్సైన్మెంట్ భూములను 22వ నంబర్ జాబితా నుంచి తొలగించి అసలు వన్బీ రికార్డులు అందించాలని, పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాలపాటి ఉదయ్, ఎస్కే సుభాని, మాదాసు ప్రసాద్, గురువులు వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.