హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ.. పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ.. పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు
కర్నూలు, ఆగస్టు 25:
కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో దొంగలు రెచ్చిపోయారు. పోలీసు సిబ్బంది ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇళ్లలో తాళాలు పగులగొట్టి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు.
హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంట్లో నుంచి సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇంట్లో 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ.30 వేల నగదును అపహరించారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ప్రాంతంలో పోలీసుల ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.