మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు....
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ.1.25 లక్షల నగదు సీజ్
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఏసీబీ డీఎస్పీ సీతారాం
మదనపల్లి:
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై కడప ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.1.25 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. నగదుతో పాటు పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. లంచం అడిగిన ఘటనలపై 9440446191 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ఏసీబీ లక్ష్యమని డీఎస్పీ సీతారాం పేర్కొన్నారు.