పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చైర్మన్గా కేశవరావు.. సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా తదితరులు
హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భవిష్యత్, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావును చైర్మన్గా నియమించగా, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, విద్యుత్ శాఖ కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ను మెంబర్ కన్వీనర్గా నియమించారు. 30 రోజుల్లోగా సిఫారసులతో కూడిన నివేదికను అందించాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పాలిటెక్నిక్ పాఠ్యాంశాల్లో మార్పులు చేయడం, ఆధునిక సదుపాయాల కల్పన, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. తద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.
ఇదిలా ఉండగా పాలిటెక్నిక్ విద్యను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానం చేసే ప్రతిపాదనపై విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాలిటెక్నిక్ విద్య భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఉద్యోగ అవకాశాలపై ప్రభావం ఉంటుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే సమగ్ర పరిశీలన కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక విద్యను బలహీనపరచడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.