శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
వడ్డెర అన్నదాన సత్రంలో కలకలం.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?
నంద్యాల జిల్లా, ఆగస్టు 25: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలోని ఓ గదిలో ఈ ఘటన వెలుగుచూసింది.
గత మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. బాత్రూమ్లో ముగ్గురు మహిళలు, గదిలోని ఫ్యాన్కు ఇద్దరు పురుషులు ఉరివేసుకుని కనిపించారు.
మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నెల రోజులుగా సత్రంలోనే బస
పోలీసుల ప్రాథమిక విచారణలో సుధాకర్ కుటుంబ సభ్యులు గత నెల 28న శ్రీశైలం వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడైంది. రోజుకు రూ.800 చెల్లిస్తూ అక్కడే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు రోజుల తర్వాత గది ఖాళీ చేయాలని సత్రం నిర్వాహకులు సూచించినప్పటికీ.. అనారోగ్యంతో వచ్చామని, మరికొన్ని రోజులు ఉండి పూజలు చేయించుకుంటామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం.
పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఘటనా స్థలాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పరిశీలించారు.
ఐదుగురి మృతదేహాలను పోలీసులు కిందకు దించి శవ పరీక్షల నిమిత్తం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే వడ్డెర సత్రం నిబంధనలకు విరుద్ధంగా నెల రోజులపాటు గదిని అద్దెకు ఇవ్వడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతులు శ్రీశైలంలో ఇంతకాలం ఎందుకు ఉన్నారు? వారి కుటుంబ పరిస్థితులు ఏంటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.