రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
కమీషన్ పెంచాలి.. పనిభారం తగ్గించాలి.. స్మార్ట్ఫోన్లు మంజూరు చేయాలి: రేషన్ డీలర్ల డిమాండ్
ఏలూరు, ఆగస్టు 25:
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కమీషన్ పెంపు, పనిభారం తగ్గింపు, స్మార్ట్ఫోన్ల మంజూరు వంటి డిమాండ్లతో డీలర్లు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల యూనియన్ నాయకులు రాజులపాటి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది రేషన్ డీలర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న కమీషన్ కేవలం రూ.6 వేలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా రేషన్ షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న డీలర్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి తోడు ప్రభుత్వం రేషన్ డీలర్లపై అదనపు పనిభారం మోపుతోందని విమర్శించారు.
బియ్యం బస్తాలను డీలర్లే దించుకోవాలని, ప్రతి బస్తాపై ఉన్న క్యూ ఆర్ కోడ్ నమోదు చేయాలని, ప్రతిరోజూ పంపిణీ చేసిన బియ్యం వివరాలతో పాటు ఖాళీ అయిన బస్తాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్లను స్కాన్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల మరింత భారం పెరిగిందని గంగాధర్ పేర్కొన్నారు.
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం పెంచడంతో పాటు కమీషన్ను పెంచాలని, అదనపు పనులను తగ్గించాలని, అవసరమైన సాంకేతిక సదుపాయాల కోసం ప్రతి డీలర్కు స్మార్ట్ఫోన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.