మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్
నూజివీడు, ఆగిరిపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో అఖిలభారత స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్డబ్ల్యూఎఫ్) మండల అధ్యక్షురాలు కలపాల రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బక్కయ్య మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించలేదని, పారిశుధ్య కార్మికులు, ఆయాలకు ఆరు నెలలుగా వేతన బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు జూలై నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, పాఠశాలల్లో సేవలందిస్తున్న కార్మికులకు మాత్రం జీతాలు, బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. నెలల తరబడి వేతనాలు అందక కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగిరిపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆగస్టు 27న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని, కార్మికులు పాల్గొన్నారు.