బంగ్లాదేశ్ రంగ్పూర్లో హిందూ కుటుంబం దారుణ హత్య?
బంగ్లాదేశ్ రంగ్పూర్లో హిందూ కుటుంబం దారుణ హత్య? నలుగురు మృతి.. అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు
బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. తాళం వేసి ఉన్న ఇంట్లో రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, కుమార్తె అగామి, కుమారుడు ప్రియమ్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నలుగురిని గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గణపతి చక్రవర్తి మృతదేహం ఇంటి పైకప్పుపై, భార్య ప్రీతిలత, కుమార్తె అగామి మృతదేహాలు మెట్ల వద్ద, కుమారుడు ప్రియమ్ మృతదేహం మంచం కింద లభ్యమయ్యాయి.
రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవడంతో బంధువులు ఆందోళనకు గురై ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు, నేర పరిశోధన విభాగం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.