యూట్యూబ్లో వ్యూస్ లెక్కింపులో భారీ మార్పులు....
యూట్యూబ్లో వ్యూస్ లెక్కింపులో భారీ మార్పులు.. 10 లక్షల వ్యూస్ వచ్చినా ఆదాయం పెరగదు!
వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా నమోదు.. ఎంగేజ్మెంట్ ఆధారంగానే ఆదాయం
యూట్యూబ్ క్రియేటర్లకు కీలక మార్పులు రాబోతున్నాయి. వీడియో వ్యూస్ లెక్కింపు విధానంలో కొత్త మార్పులను అమలు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇకపై వీడియో ప్లే అయిన వెంటనే పబ్లిక్ వ్యూగా నమోదు కానుంది. దీంతో ఛానెళ్లలో కనిపించే వ్యూస్ సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయం మాత్రం పెరగదని స్పష్టం చేసింది.
కొత్త విధానం ప్రకారం లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్కు ఒకే విధమైన వ్యూ లెక్కింపు విధానం అమలు కానుంది. ఇప్పటివరకు వీడియోను కొంత సమయం చూసిన తర్వాతే వ్యూగా పరిగణించే విధానం ఉండగా, ఇకపై వీడియో ప్రారంభమైన వెంటనే వ్యూగా నమోదు కానుంది.
వ్యూస్ పెరిగినా ఆదాయం మాత్రం అదే!
యూట్యూబ్లో లక్షలు, మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చినా క్రియేటర్ల ఆదాయం నేరుగా పెరగదు. ప్రకటన ఆదాయం, వీక్షకుల ఎంగేజ్మెంట్, వీడియోను చూసిన సమయం వంటి అంశాల ఆధారంగానే ఆదాయం నిర్ణయమవుతుంది. కేవలం పబ్లిక్ వ్యూస్ సంఖ్య పెరగడం వల్ల బ్యాంక్ ఖాతాలో వచ్చే ఆదాయంలో మార్పు ఉండదని యూట్యూబ్ వెల్లడించింది.
ఏఐ వీడియోలపై కఠిన నిబంధనలు
కృత్రిమ మేధస్సు ఆధారంగా పెద్ద ఎత్తున తయారు చేసే నాణ్యత లేని రొటీన్ వీడియోలకు మానిటైజేషన్ విషయంలో యూట్యూబ్ కఠిన చర్యలు తీసుకోనుంది. ఏఐ సాధనాలను ఉపయోగించినా, అందులో క్రియేటర్ సృజనాత్మకత, ఉపయోగకరమైన సమాచారం లేదా వినోద విలువ ఉండాలని స్పష్టం చేసింది.
కొత్త ఛానెళ్లకు పెరగనున్న అర్హత ప్రమాణాలు
మానిటైజేషన్ కోసం కొత్త ఛానెళ్లకు అర్హత నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. వెయ్యి మంది చందాదారులతో పాటు నిర్దిష్ట సమయంలో అవసరమైన వీక్షణ సమయం లేదా షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. కేవలం వ్యూస్ పెంచుకోవడం కాకుండా, ప్రేక్షకులను ఎక్కువసేపు ఆకట్టుకునే నాణ్యమైన కంటెంట్ సృష్టించడమే క్రియేటర్లకు కీలకంగా మారనుంది.