ఆసియా క్రీడలకు 492 మంది భారత అథ్లెట్లు.. బరిలో సింధు, సాత్విక్ సహా తెలుగు తేజాలు
వచ్చే నెల 19 నుంచి జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 492 మంది భారత అథ్లెట్లు ఈ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
భారత బృందంలో 265 మంది పురుష అథ్లెట్లు, 227 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్ విభాగం నుంచి అత్యధికంగా 73 మంది క్రీడాకారులు బరిలోకి దిగనుండగా, బ్యాడ్మింటన్ విభాగం నుంచి 20 మంది పాల్గొననున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు స్టార్ క్రీడాకారులు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, షూటర్ ఇషా సింగ్, ఆర్చర్ జ్యోతి సురేఖ, దీరజ్ తదితరులు ఆసియా క్రీడల్లో భారత పతక ఆశలుగా నిలవనున్నారు.
ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఎక్కువ పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.