జైపూర్ పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: డాక్టర్ నరేందర్ రాథోడ్
జైపూర్: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది పనితీరుపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, పీహెచ్సీలో ప్రసవాల సంఖ్యను పెంచేలా అవసరమైన వసతులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, పరీక్షల కోసం ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పాము, తేలు, కుక్కకాటుకు సంబంధించిన అత్యవసర మందులు, వ్యాక్సిన్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అసంక్రమణ వ్యాధుల (ఎన్సీడీ) వివరాలను పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి రోగులకు సమయానికి మందులు అందించాలని, గర్భిణుల వివరాలను పక్కాగా నమోదు చేయడంతో పాటు హై-రిస్క్ గర్భిణులపై వైద్యాధికారి రోజూ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఫార్మసీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ.. ఫార్మసిస్ట్ విధులకు సరిగా హాజరుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోజూ ఈ-ఔషధి పోర్టల్లో స్టాక్ రిజిస్టర్లు నమోదు చేయాలని, ప్రభావిత గ్రామాలన్నింటిలో ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మండల స్థాయి రెవెన్యూ, ఎంపీడీఓ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ నూరు శాతం వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ క్యారియర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పీహెచ్సీలో పనిచేస్తున్న కాంటింజెంట్ సిబ్బంది శ్రవణ్ ఎలాంటి పొరపాట్లు చేయకుండా రోజూ సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ముస్తఫా, జిల్లా అధికారి బుక్కా వెంకటేశ్వర్, సీహెచ్ఓ రాజిరెడ్డి, నర్సింగ్ అధికారులు, సిబ్బంది వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు