ఏపీలో బంగారు గని ఉత్పత్తికి శ్రీకారం.. జొన్నగిరిలో రేపు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ గనుల చరిత్రలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బంగారు గనుల ప్రాజెక్టు రేపటి నుంచి ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ఖనిజ రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.
తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో నిర్వహించిన అన్వేషణల్లో బంగారు నిల్వలు గుర్తించబడటంతో ప్రయోగాత్మక తవ్వకాలు విజయవంతమయ్యాయి. దీంతో పూర్తిస్థాయి బంగారం ఉత్పత్తికి సంస్థలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖనిజ రంగానికి ఊతం లభించనుంది.
అదే ప్రాంతంలో అదనపు తవ్వకాల కోసం కొత్త విస్తీర్ణంలో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో ప్రాసెసింగ్ యూనిట్కు కూడా సీఎం భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో చేరనుంది.
గతంలో జొన్నగిరి పరిసర ప్రాంతాలు వజ్రాల లభ్యతతో ప్రసిద్ధి చెందగా, ఇప్పుడు బంగారు నిల్వలతో మరోసారి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాయలసీమ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.