విద్యుత్ షాక్తో గాయపడిన వానరం మృతి.. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖననం
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన ఓ వానరం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలోని అశోక్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగలడంతో వానరం మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందపడిపోయింది.
సమాచారం అందుకున్న హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వానరానికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పొద్దుటూరుకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వానరం మృతి చెందినట్లు తెలిపారు.
మృతి చెందిన వానరాన్ని తాడిపత్రి కొత్త బ్రిడ్జి సమీపంలోని పెన్నా నది తీరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ఇతర ప్రమాదకర పరిస్థితుల కారణంగా జంతువులు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోతుల గంగాధర్ యాదవ్, అనంత శివారెడ్డి, కృష్ణ మోహన్ రాజు, జంతు ప్రేమికుడు ఇస్మాయిల్, రోటరీ క్లబ్ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొని వానరానికి నివాళులర్పించారు.