జులై 14న జమ్మలమడుగుకు మంత్రి లోకేశ్
కడప జిల్లా, జూలై 8: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ నెల 14న జమ్మలమడుగుకు రానున్నారు. మైలవరం మండలంలోని చిన్న కొమెర్ల గ్రామ పరిధిలో దాల్మియా సిమెంట్ సెకండ్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
టీడీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 14న జమ్మలమడుగులో బస చేయనున్న మంత్రి లోకేశ్, 15వ తేదీ ఉదయం దాల్మియా సెకండ్ ప్లాంట్ విస్తరణకు భూమిపూజ నిర్వహిస్తారు. ఈ విస్తరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
అనంతరం మంత్రి లోకేశ్ మైదుకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.