పోతనపల్లి తండాల్లో నలుగురికి బైండ్ ఓవర్
నవోదయం–2.0లో భాగంగా ఎక్సైజ్ శాఖ చర్యలు.. నాటు సారా, బెల్ట్ షాపులపై కఠిన హెచ్చరిక
చాట్రాయి: నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అవులయ్య ఆదేశాల మేరకు నూజివీడు స్టేషన్ పరిధిలోని నలుగురు పాత ఎక్సైజ్ నేరస్తులను చాట్రాయి తహసీల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బైండ్ ఓవర్ ఉత్తర్వులు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు:
హసావతు కమలం (భర్త: వెంకటేశ్వరరావు), పోతనపల్లి పెద్దతండా
ధారావతు జ్యోతి (భర్త: కృష్ణ), పోతనపల్లి పెద్దతండా
ధారావతు శ్రీరాములు (తండ్రి: చిన్నయ్య), పోతనపల్లి చిన్నతండా
మోటపోతుల వెంకట రాజేశ్వరి (భర్త: శ్రీను), కోటపాడు
ఈ సందర్భంగా నూజివీడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. నాటు సారా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులతో పాటు, బెల్లపు ఊటలను నిల్వ ఉంచుతున్న భూ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
నాటు సారా నిర్మూలనలో ప్రజలు సహకరించాలని, అక్రమ మద్యం తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.