కేంద్ర కీలక బిల్లులకు తాత్కాలిక బ్రేక్? ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కసరత్తు
కేంద్ర కీలక బిల్లులకు తాత్కాలిక బ్రేక్? ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కసరత్తు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన నిబంధనలు, 'వన్ నేషన్–వన్ ఎలక్షన్' వంటి కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమావేశాల ప్రారంభంలో విద్యార్థుల నిరసనలు, విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో కేంద్రం ముందుగా రూపొందించిన వ్యూహానికి ఆటంకం కలిగినట్లు ప్రచారం సాగుతోంది. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణపై యువత వ్యక్తం చేసిన అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం యాంటీ-లీకేజ్ బిల్లును తీసుకువచ్చి ఆమోదింపజేసినప్పటికీ, నిరసనల ప్రభావం కొనసాగినట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణలకు సంబంధించిన కీలక బిల్లులను ముందుకు తీసుకురావడం రాజకీయంగా అనుకూలం కాదని కేంద్రం భావించినట్లు సమాచారం. ముఖ్యంగా డీలిమిటేషన్, 'వన్ నేషన్–వన్ ఎలక్షన్' వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాలు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని ప్రస్తుతం ప్రవేశపెట్టకుండా ఉండాలని నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి.
వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత పరిస్థితులను సమీక్షించి, అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ బిల్లులపై చర్చించి ముందుకు వెళ్లే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.