కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్.....
కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ
ఇంట్లోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసులో సహాయం చేస్తానంటూ బాధితుడి నుంచి రూ.30 వేల నగదు డిమాండ్ చేసి, తన నివాసంలోనే లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, తదుపరి చార్జిషీట్ దాఖలు సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానని చెప్పిన ఎస్ఐ ఆంజనేయులు అందుకు ప్రతిఫలంగా రూ.30 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గురువారం ఎస్ఐ తన ఇంట్లో బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎస్ఐ దువ్వల ఆంజనేయులును అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. లంచం అడిగే అధికారులపై 1064 టోల్ఫ్రీ నంబర్ లేదా 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.