కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం......
కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురి మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడేందుకు కొండపైకి వెళ్లిన కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు చివరకు అతనితో పాటు ప్రాణాలు కోల్పోయారు.
ఖావడా హిల్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు.. ఈరోజు ఉదయం 10 గంటలకు సూసైడ్ పాయింట్కు చేరుకున్న యువకుడిని తల్లిదండ్రులు గుర్తించి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు కుమారుడిని మార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
చివరి 15 నుంచి 20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ఇద్దరూ కొండపై నుంచి కిందపడ్డారు. ఈ దృశ్యం చూసిన తల్లి షాక్కు గురై ఆవేదనతో దూకి మృతి చెందింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.